ఉద్యోగుల ఆరోగ్య పథకము (Employees Health Scheme)
“రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇప్పటివరకు అమలులో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్ స్థానంలో నగదు రహిత వైద్యం కొరకు ఉద్యోగుల ఆరోగ్య పథకము (Employees Health Scheme) ప్రవేశ పెట్టబడింది. విధివిధానాలు మరియు మార్గదర్శకాలు G.O No: 174,175, 176 Date: 01.11.2013 మరియు G.O No:134,135, Date: 29.09.2014 ద్వారా విడుదల చేయబడ్డాయి.ఈ ఉద్యోగుల ఆరోగ్య పథకము(EHS) ది.05.12.2013 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకాన్ని అమలు చేయటానికి ఏర్పాటు చేయబడిన స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చైర్మన్ గాను, సభ్యులుగా 10మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఉంటారు.”
పథకము వర్తించేవారు:
రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, ప్రొవిన్షలైజ్ చేయబడిన స్థానిక సంస్థల ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, పునర్నియామకం పొందిన సర్వీస్ పెన్షనర్లు మరియు వారిపై ఆధార పడిన కుటుంబ సభ్యులు.
కుటుంబ సభ్యులు /ఆధారితులుగా గుర్తించబడేవారు:
జీవనం కొరకు ఉద్యోగిపై ఆధార పడిన తల్లిదండ్రులు (దత్తత లేదా జన్మనిచ్చిన వారిలో ఒకరు) పురుష ఉద్యోగి సర్వీస్ పెన్షనర్ విషయంలో చట్టబద్ధమైన భార్య, మహిళా ఉద్యోగి / సర్వీస్ పెన్షనర్ విషయంలో ఆమె భర్త. ఫ్యామిలీ పెన్షనర్ల ఆధారితులు (సర్వీస్ పెన్షనర్ల మాదిరిగానే) నిరుద్యోగులైన అవివాహిత, వితంతు, విడాకులు పొందిన ఒంటరి కుమార్తెలు. 25 సం||లోపు వయస్సు ఉన్న నిరుద్యోగ కుమారులు. ఉద్యోగానికి పనికి రాని వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు.
పథకము వర్తించని వారు:
C.G.HS, E.S.I.S, రైల్వేలు, ఆర్.టి.సి, పోలీస్ డిపార్ట్మెంట్ నందలి ఆరోగ్య భద్రత, ఎక్సైజ్ శాఖలో సహయత పధకం వర్తించే ఉద్యోగులు, లా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, క్యాజువల్ మరియు రోజు వారి భత్యం చెల్లించబడే పనివారు. దత్తత తల్లిదండ్రులు జీవించి ఉన్నచో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, స్వతంత్రులైన పిల్లలు. అఖిల భారత సర్వీస్ ఆఫీసర్లు, పెన్షనర్లు.
ఇన్ పేషెంట్ చికిత్స :
పథకము ద్వారా జాబితాలో పేర్కొనబడిన 1885 వ్యాధులకు నెట్వర్క్ హస్పిటల్లో ఇన్ పేషెంట్ చికిత్స అందించబడుతుంది. శస్త్ర చికిత్స అనంతరము కూడా అవసరమైన చికిత్స అందించబడుతుంది.
అవుట్ పేషెంట్ చికిత్స:
దీర్ఘకాలిక తీవ్ర వ్యాధులకు సంబంధిత జాబితాలో పేర్కొనబడిన ఆసుపత్రులలో అవుట్ పేషెంట్ చికిత్స అందించబడుతుంది. అవుట్ పేషెంట్ (ఓపి) చికిత్స క్రింద దీర్ఘకాలిక రోగాలైన డయాబెటిస్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, సెరిబ్రో వాస్క్యూలార్ వ్యాధులు, క్యాన్సర్, క్షయ, కుష్టు వ్యాధులు, సర్జరీ అనంతరము కొనసాగించవలసిన చికిత్సలను అనుమతిస్తారు. ఈ క్లినిక్ లలో కన్సల్ టెంట్ డాక్టర్, ఫార్మసీ, రేడియాలజీ, క్లినికల్ సేవలు అందుబాటులోఉంటాయి. 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకంగా గుర్తించిన ఆసుపత్రులలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొనవచ్చును.
చికిత్స ఖర్చు :
ప్రతిసారీ 2లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్స అందించబడుతుంది. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా చికిత్స పొందవచ్చు. ఏదైనా సందర్భములో చికిత్సకయ్యే ఖర్చులు 2లక్షలు దాటినప్పటికీ చికిత్స కొనసాగుతుంది.
ఖర్చు చెల్లింపు:
అనుమతించిన ప్యాకేజి రేట్ల ప్రకారం చెల్లింపు చేస్తారు. హస్పిటల్లో చేరిన తేదీ నుండి డిశ్చార్జ్ అయిన 10 రోజుల వరకు ప్యాకేజిలో భాగంగా పరిగణించబడుతుంది. అన్ని పరీక్షలు, మందులు, శరీరంలో అమర్చే సాధనాలు, ఆహారం,శస్త్ర చికిత్స / చికిత్స అనంతరం కలిగే ఇబ్బందులు, చికిత్స తరువాత అవసరమైన ఫాలో అప్ చికిత్స ప్యాకేజిగా పరిగణించ బడతాయి.
చందా చెల్లింపు:
ఉద్యోగులను 2015 వేతన స్కేళ్ళు ఆధారంగా 3 స్లాబులుగా విభజించారు.
ఎ) వేతన స్కేలు రూ.13000-40270 నుండి రూ.14600-44870 గా గల ఉద్యోగులు స్లాబ్ A.
బి) వేతన స్కేలు రూ.15030-46060 నుండి రూ.28940-78910 గా గల ఉద్యోగులు స్లాబ్ B
(సి) వేతన స్కేలు రూ. 29760-80930 నుండి రూ. 87130 110850 గా గల ఉద్యోగులు స్లాబ్ C గా పరిగణించబడతారు. స్లాబ్ A మరియు B ఉద్యోగులు నెలకు రూ.225/-లు, క్లబ్ C ఉద్యోగులు నెలకు రూ. 300/- ల వంతున చందా చెల్లించాల్సి ఉంటుంది. స్లాబ్ A మరియు B ఉద్యోగులు సెమి ప్రైవేటు వార్డులో, స్లాబ్ C ఉద్యోగులు ప్రైవేటు వార్డులో చికిత్స పొందటానికి అర్హులవుతారు. పెన్షనర్లు / ఫ్యామిలీ పెన్షనర్లు చెల్లించవలసిన చందాను పెన్షనరు రిటైర్ అయిన నాడు ఏ పోస్టులో వున్నాడో RPS-2015 లో అదే పోస్టు స్కేలును బట్టి నిర్ధారిస్తారు. భార్యా భర్తలు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు/ సర్వీస్ పెన్షనర్లు అయితే ఎవరో ఒకరు చందా చెల్లిస్తే సరిపోతుంది.